ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 5:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భారత యువత సత్తాకు స్టార్టప్‌లే నిదర్శనం 20వ రోజ్‌గార్‌ మేళాలో 51,000 మందికి పైగా నియామక పత్రాల పంపిణీ భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరణ‌ చిన్న నగరాల్లోనూ స్టార్టప్‌లు వస్తుండటం శుభపరిణామం అన్న ప్రధాని రూ. లక్ష కోట్లతో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన

అర్జున్ సమాచారం:
కొత్తగా చేరిన ఉద్యోగులకు నిరంతర అభ్యాసంపై ప్రధాని మోదీ సూచన
దేశ యువత సామర్థ్యానికి, వారి సత్తాకు దేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థే ఒక గొప్ప ఉదాహరణ అని ప్రధానమంత్రి నరేంద్ర

మోదీ అన్నారు. ఒకప్పుడు కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన స్టార్టప్‌ల కథ ఇప్పుడు చిన్న పట్టణాలకు, నగరాలకు కూడా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు.  20వ రోజ్‌గార్‌ మేళా సందర్భంగా

శనివారం ఆయన వివిధ ప్రభుత్వ సంస్థలకు కొత్తగా ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల నుంచి 51,000 మందికి పైగా యువతకు నియామక

పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. “భారతదేశం నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా నిలిచింది. గుర్తించబడిన స్టార్టప్‌లలో దాదాపు సగం టైర్-2, టైర్-3

నగరాల్లోనే ఉన్నాయి. ఇది భారతదేశ నూతన ఆర్థిక వ్యవస్థలో గ్రామాలు, పట్టణాలు, చిన్న నగరాల నుంచి వచ్చిన యువత కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని చూపిస్తోంది” అని వివరించారు. చిన్న

పట్టణాలకు చెందిన యువత తమ సొంత ఆలోచనలతో కొత్త కంపెనీలను స్థాపిస్తూ, తమతో పాటు ఇతర యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు

రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. “ఈ లక్ష్యంతోనే సుమారు రూ. 1 లక్ష కోట్లతో ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్

యోజన’ను ప్రారంభించాం. ఈ పథకం ద్వారా దాదాపు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి రూ. 15,000 వరకు

ప్రోత్సాహకం అందించడంతో పాటు, కొత్త ఉద్యోగాలను సృష్టించే యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి” అని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగం కాబోతున్న నూతన ఉద్యోగులకు ప్రధాని కీలక

సూచనలు చేశారు. “మీరు, మీ తల్లిదండ్రులు ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు దేశంలోని ఏ పౌరుడూ ఎదుర్కోకుండా చూడటమే మీ లక్ష్యం కావాలి. ప్రభుత్వ సేవలో చేరిన వెంటనే ఈ మిషన్‌ను మీరు

చేపట్టాలి” అని పిలుపునిచ్చారు. నిరంతరం నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలు, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఇందుకోసం ‘మిషన్ కర్మయోగి’ని రూపొందించినట్లు

తెలిపారు. ఇప్పటికే 1.70 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు ‘iGOT కర్మయోగి’ ప్లాట్‌ఫామ్‌లో చేరారని, కొత్తగా చేరే వారి కోసం ‘కర్మయోగి ప్రారంభ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని సిద్ధం చేశామని

వివరించారు. మీరు మిమ్మల్ని ఎంతగా మెరుగుపరుచుకుంటే, దేశ పౌరులకు అంత మెరుగైన సేవలు అందించగలరని ప్రధాని పేర్కొన్నారు
===================